- ‘కర్షక తుల్లాలి’ సభలో బి వెంకట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి, కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడేలా దేశాన్ని అస్థిర పరిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని చేస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుఎ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు రోజువారీ వేతనంగా రూ.800-900 ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ కార్మికులకు, రైతులకు, ఇతర పనుల వారికి ఉపయోగపడేలా ‘(కర్షక తుల్లాలి)’ వ్యవసాయ కార్మిక, కర్షక సేన’ను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేక యూనిఫాంతో ఈ సేన ఉంటుందన్నారు. లక్షలాది మంది సభ్యలుగా ఉన్నారని అన్నారు. కేరళలోని పాల్కడ్లో కార్మిక, కర్షక సేన సభకు గురువారం ముఖ్య అతిథిగా హాజరైన బి వెంకట్ మాట్లాడుతూ.. గతంలో గ్రామీణాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయ కార్మికుల కోసం, వారి వేతనాలు కోసం కార్మికులు, కర్షకులు మధ్య వారధిగా నిలిచేందుకు (కర్షక తుల్లాలి) వ్యవసాయ కార్మిక, కర్షక సేన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కేరళ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలంతా తమ ప్రభుత్వాన్ని తాము కాపాడుకుంటామంటూ క్షేత్రస్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రతి కుటుంబాన్నీ కలిసి వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించిందన్నారు. కార్మిక, కర్షక మైత్రితో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతోందన్నారు.