న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ నిబంధనలను లడఖ్ ప్రాంతానికి ఏ రీతిన అమలు చేయవచ్చో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అధికారులు, పౌర సమాజ నేతల మధ్య శనివారం అవగాహన కుదిరింది. మెజారిటీ బౌద్ధులు, షియా ముస్లిం ప్రాబల్యం గల ప్రాంతాలకు వరుసగా ప్రాతినిధ్యం వహించే లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఎబి), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కెడిఎ)లకు చెందిన సభ్యులు శనివారం లడఖ్లో కేంద్ర హోం శాఖ అధికారులను కలుసుకుని చర్చలు జరిపారు. డిసెంబరు 4 నుండి వీరు మూడో దఫా సమావేశమయ్యారు. లడఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎల్ఎబి, కెడిఎలు సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి. ఆరవ షెడ్యూల్లో లడఖ్ను చేరిస్తే ఆ ప్రాంతానికి గిరిజన హోదా వస్తుంది.