సిరిసిల్ల: గతంలో చాలామంది బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బిఆర్ఎస్ను తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీని వల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి బిఆర్ఎస్ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు.