– సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి
ప్రజాశక్తి – సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా):తెలుగు రాష్ట్రాల్లో ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా విద్య, వైద్య సేవలందిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. దీని ద్వారా ఉచితంగా వైద్యం అందించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో రూ.44 లక్షల విలువైన మాస్కులు సరఫరా చేసినట్లు చెప్పారు. 20 వేల కుటుంబాలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశామని తెలిపారు. ట్రస్టు నడుపుతున్న పాఠశాలల్లో 1238 మందికి ఉచిత విద్య అందిస్తున్నామని, పేద విద్యార్థులకు రూ.3.44 కోట్లు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని భువనేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి జి.సంధ్యారాణి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్పి భంజ్దేవ్, తదితరులు పాల్గొన్నారు.