ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇడి కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఇడి అధికారులు శనివారం ఉదయం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఇడి కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా..ఇడి తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.