నాయకులు, కార్యకర్తల ఆందోళన
ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు గోదావరి) :నిడదవోలు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును ప్రకటించాలని సూర్యరావుపాలెంలో సర్పంచ్ మెండే లలితకుమారి, వార్డు సభ్యులు, ఆ పార్టీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ లలితకుమారి మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా శేషారావును ప్రకటిస్తారనే ఆశతో ఇంతకాలం ఎదురుచూశామన్నారు. తొలి జాబితాలో శేషారావు పేరు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. రెండో జాబితాలో తప్పనిసరిగా ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్న తమకు, రాజమండ్రి రూరల్కు చెందిన జనసేన అభ్యర్థిని నిడదవోలుకు కేటాయిస్తున్నారనే సమాచారం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీకి విధేయుడుగా నడుచుకుంటున్న శేషారావుకే సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. బుధవారం చంద్రబాబు పాల్గోనున్న తాడేపల్లిగూడెం బహిరంగసభకు శేషారావుకు మద్దతుగా భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు పాల్గనేందుకు వెళుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నందిన శ్రీనివాస్, కరుటూరి మంగాయమ్మ, అంబటి శివకృష్ణ, నిమ్మగడ్డ రామకృష్ణ, కోనా ప్రసాద్, నిమ్మగడ్డ మోహనరావు, కూచిపూడి లీలా సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు.