డిసెంబర్‌ 28 నుంచి రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా సివిల్‌ సప్లరు డిపార్ట్‌మెంట్‌ అధికారులు గైడ్‌లైన్స్‌ను వేగంగా ప్రిపేర్‌ చేస్తున్నారు. కస్టమర్లు ఎంత మంది ఉన్నారు.. ఎవరికి వర్తింప జేయాలి.. ప్రభుత్వంపై పడే భారం ఎంత..? అనే లెక్కలు తీస్తున్నారు.’రూ. 500కే సిలిండర్‌’ స్కీమ్‌కు గైడ్‌లైన్స్‌ రూపొందించే పనిలో సివిల్‌సప్లర్సు ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కుటుంబ యూనిట్‌గా తీసుకోవాలా.. లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా.. అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. కేవలం మహిళల పేరుతో గ్యాస్‌ కనెక్షన్లను లెక్కలోకి తీసుకుంటే.. అవి 70 లక్షల వరకు ఉన్నాయి. ఒక వేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శాలు ఇస్తే గ్యాస్‌ కనెక్షన్లలో ‘నేమ్‌ చేంజ్‌’ అనే ప్రొవిజన్‌ ఉండటంతో మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టే చాన్స్‌ ఉంది. మహిళల పేరుమీదున్న కనెక్షన్లకే రూ. 500కు సిలిండర్‌ అని మార్గదర్శకాలు రూపొందించినా.. మిగతావాళ్లు కూడా ‘నేమ్‌ చేంజ్‌’ ఆప్షన్‌ను ఉపయోగించుకుంటారన్న వాదన వినిపిస్తున్నది.

 

➡️