ప్రజాశక్తి-నందిగామ: ఎన్టిఆర్ జిల్లా నందిగామ పోలీస్స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైసిపి నిర్వహించిన సభలో తంగిరాల సౌమ్యపై అనుచిత వీడియోలను ప్రదర్శించారు. దీంతో ఆమె వైసిపి నేతలు కరీముల్లా, షేక్ యాకుబ్ అలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులు గడిచిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో టిడిపి నేతలు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో టిడిపి నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావుపై నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్ దుర్భాషలాడారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం జగన్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.