హైదరాబాద్: ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది.అనంతరం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చుతాం. వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైంది. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోంది. నిరుద్యోగ భఅతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించింది. పార్లమెంటు ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుంది” అని మంత్రి స్పష్టం చేశారు.