బంజారాహిల్స్ : పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు తస్కరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం 12లో నివాసం ఉంటున్న యష్ లల్వానీ అనే వ్యాపారి ఇంట్లో మూడేళ్లుగా బీహార్కు చెందిన సాహెబ్ కుమార్(21) పని మనిషిగా చేస్తున్నాడు. ఇటీవల యష్ లల్వానీ తల్లికి చెందిన 3 వజ్రపు ఉంగరాల జతలు బీరువాలో పెట్టారు. పదిరోజుల తర్వాత చూడగా బీరువాలో పెట్టిన ఉంగరాలు కనిపించలేదు.
అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో పనిమనిషి సాహెబ్ కుమార్ గదిలోకి వెళ్లినట్లు కనిపించింది. దీంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ యష్ లల్వానీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 381 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.