శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

cpm-condolence-to-n-sankaraiah

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వాతంత్య్రయోధులు, సిపిఎం వ్యవస్థాపక సభ్యులు ఎన్‌ శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం శంకరయ్యకు నివాళి కార్యక్రమం జరిగింది. ముందుగా శంకరయ్య చిత్రపటానికి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతాప సూచకంగా నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శంకరయ్య అఖిల భారత కిసాన్‌సభ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారన్నారు. తమిళనాడులో ఆయనకు ప్రముఖ రైతు నాయకుడిగా పేరుందని, మధురైలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించారని అన్నారు. 1940లోనే పార్టీ సభ్యత్వం తీసుకుని స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థి దశలోనే పాల్గొన్నారని అన్నారు. ఆయన డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేయకుండా జైలుకు వెళితే ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఆయనకు డిగ్రీ ప్రధానం చేసిందన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉండటమే కాకుండా, కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణంలో జాతీయ కౌన్సిల్‌ బహిష్కరించి బయటకు వచ్చిన 32 మందిలో శంకరయ్య ఒకరన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. శంకరయ్య శత జయంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆయన ఇంటికి వెళ్లి సత్కరించి, రూ.10 లక్షలు అందిస్తే.. దానిని కరోనాతో బాధపడుతున్న వారికి అందించాలని కోరారని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఉమామహేశ్వరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ తమిళనాడులో బలమైన కమ్యూనిస్టు ఉద్యమం ఉందంటే శంకరయ్య, రామ్మూర్తి వంటి వారి కృషి, కార్మికోద్యమాన్ని నిర్మించడంలో వారు చేసిన త్యాగాలే కారణమన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. శంకరయ్య క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మించి అంకితభావంతో పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, మంతెన సీతారాం, సిహెచ్‌ బాబురావు పాల్గొన్నారు.

➡️