ఒక పార్లమెంట్‌, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ

Apr 5,2024 00:50 #Congress, #cpi ramakrishna
  •  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
  •  కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, సిపిఐ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఐను బలపర్చటానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఎపిసిసి చీఫ్‌ షర్మిల నివాసంలో ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగాయని, షర్మిలతోపాటు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కె.రాజు పాల్గొన్నారని తెలిపారు.
సిపిఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జి. ఓబులేషు పాల్గొన్నారని, ఈ సమావేశంలోనే సిపిఐని కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తుందనే అంశాన్ని ప్రకటించారని వివరించారు. దీనిలో భాగంగా గుంటూరు పార్లమెంట్‌తోపాటు విజయవాడ వెస్ట్‌, విశాఖపట్నం వెస్ట్‌, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై ఎపిసిసి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️