బొండపల్లి (విజయనగరం) : తల్లిదండ్రులను కొడుకు కత్తితో నరికి చంపిన ఘటన శుక్రవారం విజయనగరంలోని బొండపల్లిలో జరిగింది. మండలంలోని బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల రాము (55) భార్య జయలక్ష్మి (30)ను మొదటి భార్య కుమారుడు డోల లక్ష్మణరావు వారి ఇంటి ముందే కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగింది. డోల రాము మొదట తన స్వగ్రామంలోని దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు… పెద్దవాడు డోల పైడిరాజు ఇతడు విశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవవాడు డోల లక్ష్మణరావు కూలి పని చేసుకుంటూ వేరొక ఇంట్లో ఉంటున్నాడు. తండ్రి రాము విజయనగరంలో ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తుంటాడు. అతడి రెండో భార్య జయలక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. రాము, జయలక్ష్మిలకు ఒక కుమార్తె చంద్రిక ఉంది. ఈమె బండపల్లిలో 8వ తరగతి చదువుతోంది. హత్య జరిగిన సమయంలో కుమార్తె స్కూల్లో ఉంది. స్థానిక పోలీసులు సిఐ ప్రభాకర్, ఎస్ఐ కె.లక్ష్మణరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.