ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

  • ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు. గురువారం ఎలక్టోర్‌ ఆఫీసర్‌ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం, కె.హరికిషోర్‌లు హాజరయ్యారు. బిజెపి, వైసిపి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంపై సిఇఓకు మెమోరాండం సమర్పించారు. ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ స్పందిస్తూ.. మతాన్ని ఉపయోగిస్తూ ఏర్పాటు చేసిన హౌర్డింగులు కోడ్‌ రాగానే తొలగిస్తామని హామీనిచ్చారు. ‘మతాన్ని ఎన్నికలలో ఓట్లకోసం ఉపయోగించకూడదని స్పష్టంగా ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ చెబుతున్నప్పటికీ బిజెపి రామాలయం ఫోటోలు, బిజెపి పార్టీ గుర్తు, నాయకులు, అభ్యర్థుల ఫోటోలతో ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టారు. ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్దం. విగ్రహాలకు ముసుగువేస్తున్న నేపథ్యంలో ఇటువంటి హోర్డింగులు పెట్టడం ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభపెట్టడమే. మీరు తక్షణం ఈ హోర్డింగులను తొలగించి, చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు పూర్తియ్యే వరకు మీరు మతాన్ని, దేవుళ్ళను ఉపయోగించే చర్యలను నిరోధించాలి.. ఎన్నికల విధులలో వలంటీర్లను ప్రధాన బాధ్యతల్లో ఉపయోగించరాదు.ఈ విషయాన్ని ఎన్నికల కమీషన్‌, కోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర మంత్రులు బహిరంగ సభల్లో, సమావేశాల్లో వలంటీర్లు వైసిపి గెలుపుకు తోడ్పడాలని వాఖ్యలు చేస్తూ పదే పదే ఉల్లంఘిస్తున్నారు. వలంటీర్లతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వలంటీర్లకు తాయిలాలు పంచుతున్నట్లు పత్రికల్లో వస్తున్నాయి.వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

➡️