వాయు’గండం’!

May 22,2024 23:58 #Vayu'Gandam'!

..మత్స్యకారులు వేటకెళ్లద్దు

– రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటినుండి ఒకమోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపారు. బుధవారం సాయంత్రానికి అల్పపీడనం ఈశాన్యదిశగా కదులుతోందని, ఇలాగే ప్రయాణించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో వుండకూడదన్నారు.

➡️