– జగన్వి అప్రజాస్వామిక చేష్టలన్న నాయకులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: అంగన్వాడీ కార్మికుల సమ్మెను నిషేధిస్తూ జారీ చేసిన ఎస్మా జిఓను సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యాన దగ్ధం చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వారిపైనే నిర్బంధం ప్రయోగించడం పచ్చి నియంతృత్వమని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలి తప్ప అంగన్వాడీలపై బెదిరింపులకు దిగడం ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రజలను మోసగించే విధానాలను అనుసరిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. ఇంట్లో తల్లికి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న లక్షలాదిమంది అక్కచెల్లెమ్మల బాధ ఏమి కనబడుతుందని ప్రశ్నించారు. కేవలం తాను చెప్పింది వినాలనే మూర్ఖత్వంతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని, వీరందరూ రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీ, నరసింహారావు, న్యూడెమొక్రసీ నాయకులు పొలారి, రవిచంద్ర, ఎంఎల్ పార్టీ నాయకులు జాస్తి కిషోర్బాబు తదితరులు మాట్లాడారు.
ప్రజాశక్తి-విజయవాడ : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని గత 27 రోజులుగా డిమాండ్ చేస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అన్యాయమని దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎస్మా జిఓ కాపీలను ఆదివారం తగులబెట్టారు. సమ్మెలో భాగంగా విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిఐటియు, వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
అనకాపల్లి జిల్లా : చీడికాడ మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మౌనం విడాలి కోరారు. అనంతరం మోకాలు పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే అంగన్వాడి వర్కర్స్’మినీ వర్కర్స్’ హెల్పర్స్ వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలుచేయాలి ఐసిడిఎస్ పటిష్ట పర్చాలని నాణ్యమైన సరుకులు అందించాలని డిమాండ్ చేస్తు, అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె 27 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చీడికాడ మండలంలో మోకాలు వేసి నీరసం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం తీసుకొచ్చిన జీవో నెంబర్ 2 రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రాజెక్ట నాయకులు ఎం జానకి, రామలక్ష్మి, రాజులమ్మ, లక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా : చీపురుపల్లిలో సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో బారీ ర్యాలీ, నాలుగు రోడ్లు కూడలిలో మానవహారం. రైల్వేస్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని సంబంధిత యూనియన్ నాయకులు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిటియు రాష్ట్ర నాయకులు టివి రమణ, అంబళ్ల గౌరినాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు వరలక్ష్మి, మాలతి , నాగమణి , అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుపతిలో అంగన్వాడీలు జీవో నెంబర్ 2 కాపీలను దగ్ధం చేస్తున్న దృశ్యం ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్య, ఏఐటీయూసీ నాయకులు హాజరయ్యారు.
కడప జిల్లా : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వము ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో నెంబర్ రెండు తీసుకురావడాన్ని నిరసిస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న నాయకులు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్మా చట్టం జీవో కాపీలను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు
- పాలకొల్లులో ఎస్మా జిఓ కాపీలను తగులబెట్టిన అంగన్వాడీలు
పగో-పాలకొల్లు : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని గత 27 రోజులుగా డిమాండ్ చేస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అన్యాయమని దీనికి నిరసనగా పాలకొల్లులో అంగన్వాడీలు ఎస్మా జిఓ కాపీలను ఆదివారం తగులబెట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్మోహనరాయ్ సారధ్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష శిబిరంలో అంగన్వాడీలు ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఇసుక, గనులు, మట్టి, మధ్యంలో దోపిడీ చేస్తు ప్రభుత్వ ఖజానాకు ఎసరు పెడుతున్నారని అందుకే ప్రభుత్వంను అప్పుల పాలు చేసారని చెప్పారు. దీంతో అంగన్వాడీల భాదలు వీరికి అర్దం కావడంలేదని చెప్పారు. ఎస్మా జిఓ లకు అంగన్వాడీలు భయపడేది లేదని చెప్పారు. ఇంకా సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, పట్ణణ అధ్యక్షులు పెచ్చెట్టి సత్యనారాయణ, పురుషోత్తం, అంగన్వాడీ నేతలు పాల్గొన్నారు.
పగో : అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆదివారం యలమంచిలి మండలం చించినాడ జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలపడంతో పాటు జీవో నెంబర్ 2 కాపీలను దగ్ధం చేస్తున్న సిపిఎం నాయకులు