– మైకులు ధ్వంసం – ప్రచారం అడ్డగింత
– వైసిపి నేతల అరాచకం
ప్రజాశక్తి – కర్నూలు హాస్పిటల్ : సిపిఎం ప్రచార వాహనంపై వైసిపి నేతలు దాడి చేశారు. పాణ్యం అసెంబ్లీ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి డి.గౌస్ దేశారు, నంద్యాల ఎంపి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్ను గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు నన్నూరు గ్రామంలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఆయన రాక కోసం సిపిఎం నాయకులు గ్రామంలో వేచి చూస్తుండగా వైసిపి నాయకులు ప్రచారం చేసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. సిపిఎం ప్రచార రథంపై వైసిపి నాయకులు దాడి చేశారు. మైకులు ధ్వంసం చేసి ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని రౌడీయిజం చేశారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సిపిఎం నాయకులను, వాహనాలను పోలీసులు వెనక్కి పంపించేశారు. దీంతో నన్నూరులో సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు ప్రచారం ఆగిపోయింది. సిపిఎం ప్రచార వాహనంపై వైసిపి అల్లరిమూకల దాడిని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. ఎమ్మెల్యే కాటసాని అనుచరులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని, అరాచక శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.