ప్రజాశక్తి – ఆలూరు :కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్ గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… మనేకుర్తి పంచాయతీలో మజరా గ్రామమైన అంగస్కల్ గ్రామానికి టిడిపి నాయకులు మనేకుర్తి రాజశేఖర్ ప్రచారానికి రాకూడదని వైసిపి నాయకులు ఆంక్షలు విధించారు. గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పుండుకూర దేవేంద్ర అండతోనే రాజశేఖర్ వస్తున్నారని వైసిపి నాయకులు అగ్రహించారు. మంగళవారం ఉదయం దేవేంద్ర ఇంటికి వైసిపి కార్యకర్తలు దూదేకొండ యంకన్న, నాగరాజు, శీనప్ప, రమేష్, ముసానహళ్లి ఉలిగప్ప, అశోక్, వినోద్, రవి, లెంకన్న, గుడిసిలి శీనప్ప వచ్చారు. ఇంటి దగ్గర మట్టి పని చేస్తున్న దేవేంద్రపై గొడ్డలి, రాడ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడే ఉన్న దేవేంద్ర తమ్ముడు రామాంజిపైన, అడ్డంగా వచ్చిన స్థానికులు భీమలింగ, రమేష్, చంద్రపైన కూడా దాడికి పాల్పడ్డారు. దేవేంద్ర స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెందారని వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబసభ్యులు ఆలూరు ప్రభుత్వాస్పత్రికి వారిని తరలించారు. దాడి చేసిన వారిలో ముగ్గురిపై గతంలో గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో కేసులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పికెట్ ఏర్పాటు చేశారు.