ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలపై నోరు జారిన బొబ్బిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.బేబిరాణి, కె.సుబ్బరావమ్మ, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్(ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్టియు) ప్రధాన కార్యదర్శి వి.ఆర్,జ్యోతి కోరారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. అంన్వాడీల వేతనం 11,770, హెల్పర్లు, మినీవర్కర్లకు రూ.7000 వేతనం మాత్రమేనని, బలిసి లేరని తెలిపారు. రిటైర్మెంట్ అయిన తరువాత అంగన్వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దాన్ని అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారని పేర్కొన్నారు. ఒకసారి ఎమ్మెల్యే అయితే కోటీశ్వర్లు అయినా నెలకు రెండు లక్షల జీతం, వారికి జీవితాంతం సుమారు లక్ష రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. ఇది ప్రజల డబ్బేనని, బొబ్బిలి ఎమ్మెల్యే ఎంత పేదవారో అందరికీ తెలిసిందేనని విమర్శించారు. కష్టపడి పేదలకు సేవ చేస్తున్న అంగన్వాడీలకు వేతనాలు పెంపు, రిటైర్ అయిన తరువాత గ్రాట్యూటీ అడగడం తప్పా అని ప్రశ్నించారు. బొబ్బిలి ఎమ్మెల్యేకు ప్రజల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా వారి ఫ్రభుత్వ మంత్రులతోగానీ, ముఖ్యమంత్రితోగానీ అంగన్వాడీల గురించి మాట్లాడాలని, నోరుజారడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.