కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్‌ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్‌ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్‌ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు.

➡️