ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎంబీవీకే ట్రస్ట్ చైర్మన్ పి మధు తదితరులు బసవపున్నయ్యకు నివాళులర్పించారు.
మాకినేని బసవపున్నయ్య 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంలో పనిచేశారు. 1936లో జరిగిన విద్యార్థి సంఘం సంస్థాపక మహాసభలో జాతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమం నడిపారు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించారు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1950లో పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యారు. ఆ స్థానంలో 40 సంవత్సరాలు కొనసాగారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం పట్ల నిబద్ధతతో బాటు ప్రగాఢమైన దేశభక్తి కలవాడు. రాజ్యసభ సభ్యునిగా 1952 నుంచి 1966 వరకు పీడిత ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సి.పి.ఐ(యం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశారు.