ఖమ్మం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే మంచిదని, అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు జైళ్లో ఉన్నట్లు అవుతుందని సీపీఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. ”జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా జైళ్లో పెడితే మనకు మంచిదవుతుంది. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచివారే. కానీ వ్యతిరేకిస్తే మాత్రం వారిని జైలుకి పంపిస్తారు” అని నారాయణ మండిపడ్డారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో మాట్లాడుతూ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిని కూడా జైలుకి పంపించాలని మోడీ చూస్తున్నారని నారాయణ అన్నారు. దేశ ద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తె మోడీని, రెండవ వ్యక్తిగా అమిత్ షాలను అరెస్ట్ చేయాలని నారాయణ మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్పై కూడా మండిపడ్డారు. ” కేసీఆర్ మాట్లాడుతున్నాడు నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తాడంట. ఈయనకే దిక్కు లేదు నామాను మంత్రిని చేస్తాడట. నరేంద్ర మోడీ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రతి కార్యకర్త మన అభ్యర్థి. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని గెలిపించాలి” అని నారాయణ ఓటర్లను కోరారు.ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసం చూస్తూనే ఉన్నామని, మోదీ మూడవసారి ప్రధాని అయ్యి, 400 సీట్లు వస్తే భారతదేశం ఇలా ఉండదని అన్నారు. పూర్తి హిందూ దేశంగా మారుతుందని విమర్శించారు. ఇక దేశంలో ముస్లింలు అనే వారు ఉండరని, మూడవసారి మోదీ పాలన అలా ఉంటుందని అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/18-1.jpg)