అంగన్‌వాడీ నాయకులకు సిపిఎం, సిఐటియు నేతల పరామర్శ

cpm leaders visit citu leader subbaravamma

ప్రజాశక్తి-విజయవాడ : అరెస్టయి ఆస్పత్రిలో ఉన్న అంగన్‌వాడీ నాయకులు సుబ్బరావమ్మ, గజలక్ష్మిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దీక్షలో ఉన్న మహిళల ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని, ఎవరైనా నిరసనలకు దిగితే చర్చించి వారి సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం తీరు అందుకు విరుద్ధంగా ఉందని, పైగా ఎదురుదాడికి దిగుతోందని అన్నారు. నిరవధిక నిరాహారదీక్ష చేపడితే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిస్సిగ్గుగా అరెస్టులు చేయిస్తోంది తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదని, ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే మహిళలే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు.

 

సమస్యల పరిష్కారంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు గజలక్ష్మిని పోలీసులు దీక్షా శిబిరంలోనే బలవంతంగా అరెస్ట్‌ చేశారు. అంతకుముందు వారిని పరీక్షించిన వైద్యులు వారి సుగర్‌లెవల్స్‌ తగ్గుతున్నట్లు చెప్పారు. కె.సుబ్బరావమ్మ సుగర్‌లెవల్స్‌ 54కు పడిపోయింది. అలాగే గజలక్ష్మికి 63కు పడిపోయింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమించాలంటూ చేసిన సూచనను వారు తిరస్కరించారు. ప్రభుత్వం స్పందించేంతవరకు నిరవధిక దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దీక్షా శిబిరంలోకి ప్రవేశించిన పోలీసులు సుబ్బరావమ్మ, గజలక్ష్మీను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలను వారు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దీక్షా శిబిరంలో ఉన్న అంగన్‌వాడీలు కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో శిబిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ గందరగోళం మధ్యనే వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీక్షలో ఉన్న మిగిలిన 12 మంది పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీక్షకు దిగిన మరో ఇద్దరుసుబ్బరావమ్మ, గజలక్ష్మిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించిన నేపధ్యంలో వారి స్థానంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చంద్రావతి (బిఆర్‌ అంబేద్కర్‌ అమలాపురం జిల్లా), , స్వర్ణలత (ఎన్‌టిఆర్‌ జిల్లా) నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.

➡️