-మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, డయేరియా బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వండి : వి శ్రీనివాసరావు
-గుంటూరులోని డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో తాగునీటి సరఫరాలో ఏర్పడిన కాలుష్యాన్ని ముందస్తుగా గుర్తించి నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరులోని శారదా కాలనీలో నీటి కాలుష్యం బారినపడిన ప్రజలను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. గత వారం రోజులుగా నీరు కలుషితమై వందలాదిమంది ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, పద్మ అనే మహిళ మృతి చెందారని తెలిపారు. ఆమె మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పద్మ కుటుంబానినికి రూ.25 లక్షలు, వాంతులు, విరోచనాల వల్ల అస్వస్తతకు గురైన వారికి ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి పైపులు పాతవి కొనసాగిస్తూ కొత్తవి సరిగా అమర్చకపోవడం వల్ల పాత పైపుల్లో మురుగు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. 80 శాతం వ్యాధులు కేవలం నీటి కాలుష్యం వల్లే వస్తాయని, పరిశుభ్రమైన నీరు అందించకుండా అధికారులు ఇతర కారణాల వల్ల డయేరియా వచ్చిందని అర్థం లేని వాదనలతో కాలయాపన చేయడం తగదని అన్నారు. నవరత్నాలలో తాగునీటి అంశం లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి జగన్ గుంటూరులో డయేరియా ప్రబలినా పట్టించుకోలేదని విమర్శించారు. నీరు కలుషితం కావడానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరులో 2018లో కూడా ఇలాగే తాగునీరు కలుషితం వల్ల 25 మంది మృతి చెందారని, వేలాదిమంది అస్వస్తతకు గురయ్యారని గుర్తు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ గుంటూరులో తాగునీటి కలుషితంపై ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారని, కానీ ఇంతవరకు ఆ కమిటీ నివేదిక బహిర్గతం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, స్వచ్ఛమైన తాగునీటిని మాత్రం ప్రభుత్వం ప్రజలకు అందించలేకపోతోందని విమర్శించారు. అమృత్ పథకం ద్వారా 24 గంటలూ నీరు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోవడం లేదన్నారు. తాగునీరు విషంలా మారుతోందని, నీటి వ్యాపారం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు ద్వారా ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక వసతులపై దృష్టి సారించడం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నగర కార్యదర్శి కె.నళీనీకాంత్, ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎంఎ.చిష్టీ తదితరులు పాల్గొన్నారు.
ఇసుకను ఉచితంగా సరఫరా చేయండి
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నదీ తీర ప్రాంతంలో ఇసుక మాఫియాలు పెట్రోగిపోతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించడం లేదన్నారు. ఇసుకను ప్రివిలేజ్ సరుకుగా భావించి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు.