పేపరు మిల్లు కార్మికుల ధర్నా

Apr 3,2024 21:36 #Dharna, #paper mill workers

– నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌
– రేపు యాజమాన్యంతో చర్చలు జరపనున్న జెసిఎల్‌
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :రాజమండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్‌ కార్మికులు పరిశ్రమలో బుధవారం ధర్నాకు దిగారు. యాజమాన్యం వెంటనే నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మిల్లులో ఉన్న 11 రిజిస్టర్డ్‌ కార్మిక సంఘాలు ఈ ధర్నాలో పాల్గన్నాయి. వేతన ఒప్పందం కాల పరిమితి పూర్తయ్యి నాలుగేళ్లు అయినా నూతన వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం బి షిఫ్ట్‌లో ఉన్న పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు మిల్లు లోపల మెరుపు సమ్మెకు దిగారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో బుధవారం ధర్నా నిర్వహించారు. కార్మికులు అర్ధనగంగా, ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కె.మాధవీలత స్పందించారు. కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బిఎస్‌ఎం.వల్లీని విచారించారు. వెంటనే కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ (జెసిఎల్‌) ఎ.రాణి దృష్టికి తీసుకెళ్లారు. జెసిఎల్‌ సమక్షంలో గురువారం యాజమాన్యం, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు.
పాత వేతన ఒప్పందం 2020 జూన్‌ 30తో ముగిసినప్పటికీ నూతన వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. చట్టబద్ధంగా అనేక పద్ధతుల్లో పోరాడినా ఎలాంటి స్పందనా లేదు. నెల రోజుల క్రితం మిల్లులో ఉన్న 11 రిజిస్టర్డ్‌ కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. ఆ తరువాత ఏలూరు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ వద్ద యాజమాన్యం, కార్మిక సంఘాల సమావేశం జరిగింది. కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యం చేసిన సూచన మేరకు 11 సంఘాలు ఉమ్మడిగా వేతన ఒప్పందానికి సంబంధించిన డిమాండ్‌లు అందజేశాయి. యాజమాన్యం చర్చలకు పిలిచి వేతన ఒప్పందం చేయబోమని మొండిగా వ్యవహరించింది. దీంతో యూనియన్‌ నాయకులు మళ్లీ కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించారు. కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ సూచనలను యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో గత్యంతరం లేక ఆందోళనబాట పట్టామని నాయకులు, కార్మికులు తెలిపారు.

➡️