ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపే ప్రణాళికతో ముఖ్యమంత్రి జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. శనివారం విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్దనున్న తన ఇంటిలో ఉన్న బొత్సను ఎపి నిరుద్యోగ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత కుమార్ కలిసి, నిరుద్యోగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు నిజమవ్వబోతున్నాయన్నారు. జాబ్ కేలండర్, వయోపరిమితి పెంపు అంశాలనూ మంత్రి దృష్టికి హేమంత్కుమార్ తీసుకెళ్లారు. కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగి సంవత్సరం కావొస్తోందని, తప్పుగా ఉన్న ప్రతి ప్రశ్నకూ ఒక గ్రేస్ మార్క్ వేసి న్యాయం చేయాలని కోరారు.