ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మనం నివశిస్తున్న ఇంటితోపాటు పని ప్రదేశాల్లో ఇంధన పొదుపు పాటించాలని, అందుకోసం అవసరమైన, సమర్థవంతమైన పద్ధతులు అవలంభించాలని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజరు నరేంద్ర ఎ పాటిల్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు జరుగుతున్న ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బందితో డిఆర్ఎం ఇంధన పొదపు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొదుపు ద్వారా స్థిరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా ముందుకు సాగవచ్చన్నారు. రైల్వే వర్క్షాపుల సెక్టారులో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్సు-2023కి వ్యాగన్ వర్క్షాపునకు మొదటి బహుమతి రావడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకోవడం పట్ల సిబ్బందికి డిఆర్ఎం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడిఆర్ఎం డి శ్రీనివాసరావు, ఎడిఆర్ఎమ్ ఆపరేషన్స్ ఎం శ్రీకాంత్తోపాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/narendra.jpg)