అమెరికా : అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. శాటిలైట్ ఫోన్తో ఢిల్లీకి వెళుతుండగా, ఎస్పీఎఫ్ ఆపి గన్నవరం పోలీసులకు అప్పగించారు. అమెరికాకు తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కడానికి ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్ఇన్లో ఎస్పీఎఫ్ సిబ్బంది డాక్టర్ లోకేశ్ లగేజీ తనిఖీ చేసి, శాటిలైట్ ఫోన్ను గుర్తించారు. భారతదేశంలో ఆ ఫోన్ను వినియోగించేందుకు అవసరమైన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అనుమతిపత్రం లేదని నిర్థారించారు. దీంతో ఆయన్ను గన్నవరం పోలీసులకు అప్పగించగా, స్టేషన్కు తరలించారు. శాటిలైట్ ఫోన్ను స్వాధీనం చేసుకొని, దాని గురించి ఆరాతీశారు. ఆ ఫోన్ను తాను వర్జీనియాలో కొనుగోలు చేశానని, అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చినట్లు లోకేశ్ వివరించారు. దర్యాప్తునకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం విడిచిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్ ఫోన్తో దేశీయ విమానాశ్రయాల మీదుగా లోకేశ్ రాకపోకలు సాగించినట్లు గుర్తించామని సీఐ వరప్రసాద్ వెల్లడించారు.
అమెరికా రాయబార కార్యాలయానికి పోలీసుల వివరణ : విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై లోకేశ్ అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు పంపిన సంగతి విదితమే. దీనిపై ఎంబసీ అధికారులు ఆదివారం గన్నవరం పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ లోకేశ్ సిఎం జగన్ను అడ్డగించేందుకు ప్రయత్నించారని, దానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, లోకేశ్ ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ స్క్రీన్షాట్లను రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. శాటిలైట్ ఫోన్ గురించి కూడా వారికి వెల్లడించినట్లు సమాచారం.