నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ రోజు తెల్లవారుజామున నిడమానురు మండలం వేంపాడు స్టేజ్ పక్కనే ఉన్న చౌదరి హోటల్ వద్ద ట్యాంకర్ అదుపుతప్పి టాటాఎస్ వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు పెద్దవుర మండలం పుల్య తండాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు అని తెలుస్తోంది. మృతులు రమవత్ కేశవులు (19), రమవత్ పాండ్య (40), రమవత్ గణ్య (40), రమవత్ బుజ్జి (38)గా గుర్తించారు. నిన్న రాత్రి పది గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ మృతులను చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మరణాలతో పుల్య తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.