- టిప్పర్లు, ప్రొక్లెయినర్లు సీజ్
ప్రజాశక్తి – తూర్పుగోదావరి : హైకోర్టు ఆదేశాల మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేపట్టింది. ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల పాటు కడియం, పెరవలి, నిడదవోలు, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లోని ఇసుక రీచ్ల్లో తనిఖీలు నిర్వహించారు. కొవ్వూరు డివిజన్లో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించామని, ఓపెన్ రీచేస్ వద్ద గోదావరి నది ప్రాంతంలో వాహనాలను వాడకూడదు అనే అంశం అమల్లో ఉందని తెలిపారు. టిప్పర్లు, ప్రొక్లెయినర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేశామన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి, హైకోర్టుకు నివేదిక అందజేస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట జెసి ఎన్.తేజ్భరత్, ఆర్డిఒ ఎ.చైత్ర వర్షిణి, మైన్స్ ఎడి ఎం.సుబ్రహ్మణ్యం, సెబ్ అధికారి వి.సోమశేఖర్, గ్రౌండ్ వాటర్ డిడి వై.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి డి.రాంబాబు, ఇరిగేషన్ అధికారి ఆర్.కాశీవిశ్వేశ్వరరావు ఉన్నారు.