– 3 రోజుల పాటు పిఠాపురంలోనే సమావేశాలు
– రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జనసేనాని
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:తూర్పు సెంటిమెంట్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే పర్యటన షెడ్యూల్ను కూడా సిద్ధం చేశారు. తొలి మూడు రోజులూ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దిశా, నిర్దేశం చేయనున్నారు. జనసేనలో పనిచేస్తున్న అన్ని విభాగాల నాయకులతో సమావేశం కానున్నారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే కూటమి భాగంగా ఉన్న టిడిపి, బిజెపి నాయకులతోనూ ఆయన భేటీ కానున్నారు. మూడు విడతలుగా చేయనున్న ప్రచారం నేపథ్యంలో ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించి వారాహి వాహనానికి పూజలు చేయిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే నిర్వహించుకోబోతున్నారని తెలిపారు.