హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై జారీ చేసిన సర్క్యులర్, దాని అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నగరంలోని ఫంక్షన్ హాల్స్లో పెట్టే సౌండ్ పరిమితులకు లోబడి ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. బోయినపల్లిలో శబ్ద కాలుష్యం వెలువడే ఫంక్షన్ హాల్స్పై చర్యలు తీసుకునే అధికారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తూ.. శబ్ద కాలుష్య నిబంధనలపై జారీ చేసిన ఉత్తర్వుల గురించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫంక్షన్ హాల్స్ నుండి భారీ శబ్దాలు…
తాడ్బండ్ బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ పంక్షన్ హాల్స్ నుంచి భారీ శబ్ద కాలుష్యం వస్తుందంటూ … మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీరు కల్నల్ సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. ఈ పిల్ పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. శబ్ద కాలుష్యం అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయస్థానానికి తెలిపారు. దీని ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్స్ ఉండకూడదని వెల్లడించారు. పిటిషనర్ చెబుతున్న రెండు ఫంక్షన్ హాల్స్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.