ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికి తోడు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 47.7 డిగ్రీల వరకూ నమోదైన ఉష్ణోగ్రతలు ఆదివారం 45.8 డిగ్రీలకు తగ్గింది. నంద్యాల జిల్లా మహానందిలో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదైంది. అలాగే కర్నూలు జిల్లా జి సింగవరంలో 45.6 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేదనాపి అక్కమాంబపురంలో 45.5, ప్రకాశం జిల్లా వెలిగొండలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 117 మండలాల్లో వడగాడ్పులు వీచాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి రోణంకి కుర్మనాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం 29 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని తెలిపారు.