వైసిపి ప్రభుత్వంపై వేటు వేయండి

May 11,2024 21:02 #Chandrababu Naidu, #letter

రాష్ట్రప్రజలకు చంద్రబాబు లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రాన్ని కాటు వేసిన వైసిపి ప్రభుత్వంపై ఓటుతో వేటు వేయాలని రాష్ట్ర ప్రజలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. 13వ తేదీన జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్‌ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆ రోజున వేసే ఓటుతో కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలకాలన్నారు. ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ఆర్ధిక లోటుతో 2014లో టిడిపి ప్రభుత్వం ప్రయాణం మొదలు పెట్టిందని పేర్కొన్నారు. సుపరిపాలనతో అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించామని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి ప్రయోజనం కల్పించేలా వందకు పైగా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్లమని పేర్కొన్నారు. అలాంటి కీలక సమయంలో మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారాలు, డ్రామాలతో ప్రజలను మోసం చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. వైసిపి భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కోరారు.
అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి :ఆర్‌టిసి ఎమ్‌డికి లేఖ
ఎన్నికల నేపధ్యంలో అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్‌టిసి ఎమ్‌డిని చంద్రబాబునాయుడు మరో లేఖ ద్వారా కోరారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ఓటర్లు వారి సొంత ప్రాంతాలకు ఓటు వేసేందుకు వస్తారని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రయాణమవుతున్నారని వివరించారు. ఇలాంటి సమయంలో ఆర్‌టిసి సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్‌ శాతం పెరగడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

➡️