ఈనాడు’ కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి

కర్నూలు : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు మంగళవారం సాయంత్రం రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్‌ థియేటర్‌ సమీపంలోని పత్రికా కార్యాలయం వద్దకు ఆటోలు, కార్లలో వందల మంది వచ్చి హల్‌చల్‌ చేశారు. కార్యాలయ బోర్డును, కిటికీలను, అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయ తాళాలను బద్దలు కొట్టేందుకు యత్నించారు. ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనం ప్రచురించారంటూ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో వైసిపి జెండాలు చేతబట్టి జై జగన్‌, జై కాటసాని అంటూ నినాదాలు చేశారు. దీనిపై పోలీసులను సంప్రదించగా, తమకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సిఐ ఇంతియాజ్‌ బాష తెలిపారు.

➡️