ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్ల కేసు – విచారణ వాయిదా వేసిన సుప్రీం

తెలంగాణ : ఈడీ సమన్లపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ నెల 16వ తేదీన విచారిస్తామని జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ల ధర్మాసనం తెలిపింది. తుదివిచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందని, ఈ నెల 16న విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్‌ బెనర్జీ కేసులతో పిటిషన్‌ను ధర్మాసనం జతపరిచిన సంగతి విదితమే. ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్‌ సిబల్‌ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు.

➡️