పెనుకొండ : ప్రధాని నరేంద్రమోదీ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్) ఏర్పాటవుతోంది. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించనున్న ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని నేడు ప్రారంభించనున్నారు. ఐఏఎస్లకు ముస్సోరి, ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. అందులో పనిచేసే సిబ్బంది పిల్లల విద్య కోసం కేంద్రీయ విద్యాలయం, వైద్య సదుపాయాలు కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
కార్మిక, దళిత నేతల అరెస్టు
ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, సిఐటియు మండల కార్యదర్శి కొండ వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేషులను అరెస్టు చేసి రాత్రికి రాత్రే మడకశిర పోలీస్ స్టేషన్కు తరలించారు.