- సీఐటీయూ నాయకులు , మున్సిపల్ వర్కర్స్ ను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీస్ జీపుకు అడ్డం పడుకున్న కార్మికులు
ప్రజాశక్తి-పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నగర పంచాయతీ పారిశుదధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కమిషనర్ నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులను పనులలోకి రావాలని కోరడంతో కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేసేవరకు రామన్నారు. ఈ సందర్బంగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐటీయూ నాయకులు, కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి సీఐ కార్యాలయం కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, సిపిఎం నాయకులు తిప్పన్న, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- పారిశుధ్య కార్మికులు పోర్లుదండాలతో నిరసన కార్యక్రమం
మండపేట : వారి సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికుల పొర్లుదండాలు పెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయన్నారు. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.