ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఆదివారం అనేక ప్రాంతాల్లో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు విరుచుపడ్డారు. ఈ క్రమంలో అనేకమందిని అరెస్టు చేసి, జైలులో నిర్భంధించారు. అరెస్టు అయిన వారిని వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. ఇప్పటికే ఈ సమ్మెకు పెద్ద ఎత్తున మద్దతు లభించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిర్బంధాలతో సమ్మెను ఆపలేరని మున్సిపల్ కార్మికులు తేల్చి తెలిపారు.
- మున్సిపల్ కార్మికులకు కౌన్సిలర్లు బెదిరింపులు
తిరుపతి-సూళ్లూరుపేట : గత వారముగా సూళ్ళూరుపేట మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు కార్మికులు సమ్మెలో వున్నారు. ఆదివారం మున్సిపల్ ఛైర్మెన్ చెత్తా చెదారము పేరుకు పోయి ఆరోగ్య సమస్య తలెత్తుతుందని,వార్డు కౌన్సిలర్లు చొరవ తీసుకొని వారి వార్డులో స్వచ్ఛంద సర్వీసు కింద క్లీన్ చేపించుకుంటామని చెప్పారు. యూనియన్ నాయకులు దాన్ని ఆలోచిస్తామని చెప్పారు.ఈ లోపు కొంతమంది కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఒక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పనిచేస్తున్నారని, సమ్మె అయిపోయిన తర్వాత వారి సంగతి తెలుస్తామని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు మానుకోవాలని సిఐటియు సెక్రటరీ కె.లక్ష్మయ్య వారికి గట్టిగా సమాధానము చెప్పారు. పనుల్లో చేర్చుకునేటప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకన్నారు. అంతే కాకుండా ఒకే కుటుంబంలో ఒకరికి మించి పని చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో తెలియజేయాలని కౌన్సిలర్లని డిమాండ్ చేశారు. ఇలాంటి చౌకబారు విజ్ఞానంతో కార్మికులను రెచ్చగొట్టదని, రోజుకు 1500/- ఇచ్చి పోటీ కార్మికుల్ని రంగంలోకి దింపి మభ్యపెట్టి గొడవలకు పురికొల్పద్దని దానివల్ల వచ్చే పరిణామాల్ని మునిసిపాలిటీ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. పరిపాలకులుగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని,న్యాయమైన హామీ ఇచ్చిన కోర్కెలు సాధనకు ప్రజలు సహకరించాలని లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు.
కోనసీమ – మండపేట : మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తల రాతలు మారడంలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ సితార సెంటర్ లో మున్సిపల్ కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టి, దీక్షా శిబిరంలో భోజనాలు చేస్తూ నిరసన తెలిపారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మెలో ఉన్న కార్మికులు
అన్నమయ్య జిల్లా – రాజంపేట అర్బన్ : మునిసిపల్ కార్మికులు ఏడవ రోజు సమ్మెలో పురపాలక కార్యాలయం ఎదుట చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మునిసిపల్ కార్మికులకు లేనిపోని హామీలు గుప్పించి అధికారం లోకి వచ్చాక అందరి చెవుల్లో పూలు పెట్టి వంచన చేశారని ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు లక్ష్మీదేవి, కార్మికులు ప్రసాద్, పెంచలయ్య, మధు, జి.పెంచలయ్య, గంగయ్య లక్ష్మీదేవి, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.