ప్రజాశక్తి -బద్వేల్/గోపవరం (వైఎస్ఆర్ జిల్లా) : పాపులను తొక్కేయండంటూ తాను రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు వక్రీకరించారని, అవన్నీ అవాస్తమని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల గురించి తాను ఎప్పుడూ మాట్లాడనని, ఏసుక్రీస్తు వాక్యాలను మాత్రమే చెబుతానని పేర్కొన్నారు. ఆదివారం కడపలోని ఓ ప్రార్థన మందిరంలో తాను ఏసుక్రీస్తు సందేశాలను వివరిస్తూ పాములను, తేల్లను తొక్కే అధికారం యేసయ్య సంఘానికి ఇచ్చాడని పేర్కొన్నానని దానిని కొందరు పాపులను తొక్కేందుకు అంటూ రాజకీయ వ్యాఖ్యలు వచ్చేలా ప్రచారం చేశారనిపేర్కొన్నారు. నేను రాజకీయాల గురించి వారికి సపోర్ట్ చేయండి వీరికి సపోర్ట్ చేయండి అని అర్థం వచ్చేలా ఎప్పుడూ మాట్లాడనని తెలిపారు. దయచేసి తాను చెప్పే వాక్యాలను వేరే అర్థం వచ్చేలా మీడియాలో కథనాలు అల్లవద్దని కోరారు. కార్యక్రమంలో పాస్టర్ శామ్యూల్, పాస్టర్ మోసెస్, పాస్టర్ కుమార్, మరి కొంతమంది పాస్టర్లు, క్రైస్తవ సంఘం నాయకులు పాల్గొన్నారు.