నాకు, నా భర్తకు ప్రాణహాని : సునీత

May 10,2024 23:20 #press meet, #ys sunitha

ప్రజాశక్తి- ప్రొద్దుటూరు :’ న్యాయం కోసం పోరాడుతున్న నాకు, నా భర్త రాజశేఖర్‌రెడ్డి, షర్మిలకు ప్రాణహాని ఉందని’ మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌.సునీత చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉన్నట్లు స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందిందన్నారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా? తనను నరికేస్తారా? లేక షర్మిలను నరికేస్తారా? చెప్పాలని ప్రశ్నించారు. తమకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని చెప్పారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం కడప జిల్లాలో ఫ్యాక్షన్‌ ఉండేదని, ప్రస్తుతం కనుమరుగైనప్పటికీ తాజాగా మళ్లీ అలాంటి రోజులకు పోదామా? అభివృద్ధి వైపు పోదామా? అన్నది కడప ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉందన్నారు. అవినాష్‌ మాత్రమే చెప్పింది వినే జగన్‌ ఈ చెల్లెలు చెప్పేది వినరా? అని ప్రశ్నించారు. వివేకా హత్య అనంతరం జగన్‌ను కలవడానికి ఎన్నోమార్లు ప్రయత్నించినప్పటికీ అవకాశం ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రిగా కాకున్నా కొడుకుగా జగన్‌కు బాధ్యత లేదా? కుట్రదారుడు అవినాష్‌ను మాత్రమే నమ్ముతారా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నలను సంధించారు. తన తండ్రి దారుణ హత్యకు గురైతే గుండెపోటుతో మరణించినట్లు సాక్షి ఛానల్‌లో ఎందుకు ప్రచారం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ హత్యలో చెళ్లెల్లకు ఓ న్యాయం, తమ్ముడికి ఓ న్యాయమా? అని ప్రశ్నించారు. సమాజంలో ఎలాంటి హత్యా రాజకీయాలూ ఉండకూడదని, శాంతిభద్రతలు ఉండాలన్నారు. న్యాయం కోసం గొంతు తడి ఆరేలా రోదిస్తున్నామని గుండెలు పగిలేలా శోకిస్తున్నామని తెలిపారు.

➡️