ప్రజాశక్తి-అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం జెఎన్టియుకు నూతన విసిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఎస్కెయు కెమిస్ట్రీ విభాగం ఆచార్యులు కె.హుస్సేన్ రెడ్డి, అనంతపురం జెఎన్టియు నూతన ఉపకులపతిగా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ఆచార్యులు జివిఆర్.శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలారావు జీవో 6, 8 ద్వారా ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో ఎస్కెయు ఉపకులపతి మాచిరెడ్డి రామకృష్ణరెడ్డి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఇన్ఛార్జి ఉపకులపతిగా యోగి వేమన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సుధాకర్ కొనసాగుతున్నారు. సెర్చ్ కమిటీ ప్రతిపాదన మేరకు ఎస్కెయు కెమిస్ట్రీ విభాగం సీనియర్ ఆచార్యులు కె.హుస్సేన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉపకులపతిగా నియమించింది. ఇక జెఎన్టియుకు సంబంధించి విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ఆచార్యులు జివిఆర్.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న ఆచార్య రంగజనార్ధన పదవీకాలం బుధవారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ ఉపకులపతిగా జివిఆర్.శ్రీనివాసరావును నియమించింది.
![new vc to sri krishnadevaraya university](https://prajasakti.com/wp-content/uploads/2024/01/new-vc-to-sri-krishnadevaraya-university.jpg)