ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 22న జరగనుంది. తాడేపల్లిలోని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులందరికీ ఆహ్వానం పంపారు. గెలిచిన నలుగురు ఎంపిలు మినహా పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఆహ్వానం పంపారు. వారం రోజుల క్రితం శాసనమండలి సభ్యులతోనూ ఆయన సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమై పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా కార్యాచరణపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 11 సీట్లకే పరిమితం కావడంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఓటమికి గల కారణాలపై చర్చించి, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/ycp.jpg)