ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభకు 4,44,218 ఓట్లు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు 4,44,216 పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఈ నెల 5 నుంచి 9 వరకూ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజైన ఈ నెల 9న ఎంపి నియోజకవర్గాలకు 11,374 ఓట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయన్నారు. ఎంపి నియోజకవర్గాల వారీ అత్యధికంగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 22,650, అత్యల్పంగా అమలాపురం (ఎస్సి) నియోజకవర్గంలో 14,526 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు.