– సిఎస్కు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మున్సిపల్ కార్మికులను రాష్ట్రంలో ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డికి ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగభూషణ, కె ఉమామహేశ్వరరావు బుధవారం లేఖ రాశారు. ఎండల తీవ్రత వల్ల రోడ్లపై విధులు నిర్వహించే మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగాల కార్మికుల ప్రాణ రక్షణకు, ఆరోగ్యాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి మస్తర్ పాయింట్ వద్ద మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. పని ప్రదేశాల్లో ఉదయం, సాయంత్రం ఒఆర్ఎస్, మజ్జిగ, గ్లూకోజ్ ఏర్పాటు చేయాలన్నారు. చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, టవల్స్ ఇవ్వాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి ప్రభుత్వమే చికిత్స చేయించాలని, కోలుకునేంత వరకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. మరణించిన వారికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/cs-jawahar-reddy.jpg)