హనుమాన్ జంక్షన్ (కృష్ణా) : కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఎక్కి మరో కారును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వీరవల్లి పోలీసుల వివరాల మేరకు… హైదరాబాద్ నుంచి కొవ్వూరు వైపు వెళుతున్న కారు బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్ను దాటి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన థామస్ (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.