అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారన్నారు. కేంద్ర బలగాలను మోహరించాలని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ హైకోర్టులో కేసు వేశారని భాజపా నేత యామినీ శర్మ తెలిపారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించామన్నారు. భద్రత పెంచే విషయమై డీజీపీకి కూడా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని ఆరోపించారు.