తెలంగాణ విజిలెన్స్‌ డిజి రాజీవ్‌ రతన్‌ హఠాన్మరణం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సీనియర్‌ ఐపిఎస్‌, తెలంగాణ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ హఠాన్మరణం చెందారు. మృతుని కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం రాజీవ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృధుస్వభావి, వివాదరహితుడుగా ముద్రపడిన రాజీవ్‌ రతన్‌ మరణ వార్త విని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిజిపి రవిగుప్త, సీనియర్‌ ఐపిఎస్‌లు ఆస్పత్రికి వెళ్లి రాజీవ్‌ రతన్‌కు నివాళులర్పించారు. బుధవారం జూబ్లిహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1991 ఐపిఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన రాజీవ్‌ రతన్‌ కరీంనగర్‌ ఎస్‌పిగా, హైదరాబాద్‌ రేంజ్‌ డిఐజి, అగ్నిమాపక శాఖ డిజిగా పనిచేశారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు.

➡️