హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షులు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహావేడుక రాజస్థాన్లోని జోధ్పుర్ ప్యాలెస్లో ఈ నెల 16 నుంచి 18 వరకు ఘనంగా జరిగింది. 16న సంగీత్, 17న హల్దీ, 18న తలంబ్రాలు, విందు వైభవంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షర్మిల సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్టు చేశారు. పెళ్లిలో భాగంగా నిర్వహించిన ‘హల్దీ’ వేడుక ఫొటోలను శనివారం పోస్టు చేసిన ఆమె ఆదివారం తలంబ్రాలు, ఉంగరాలు మార్చుకునే ఫొటోలను షేర్ చేశారు. భావోద్వేగంతో తన స్పందన తెలియజేశారు. ఒక తల్లిగా తన జీవితంలో మరో సంతోషకరమైన క్షణాన్ని చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది, ఆత్మీయుల శుభాకాంక్షలు, ఆశీర్వాదం, దేవుడి కరుణ. నా కుమారుడి తన జీవితపు ప్రేమ (ప్రియా)తో వివాహం చేసుకున్నందున కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోతాయి’ అని షర్మిల పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో నూతన దంపతులు రాజారెడ్డి-ప్రియాతో పాటు వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ వేడుకకు షర్మిల సోదరుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.