ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో గత నెల 19 అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగినిపోయిన బోట్లను వెలికితీసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆ రోజు జరిగిన ప్రమాదంలో 40 బోట్లు అగ్ని ప్రమాదానికి గురవ్వగా, వీటిలో 29 బోట్లు నీటిలో మునిగిపోయాయి. ఆ బోట్లు మునిగిన ప్రదేశంలో ఇతర బోట్లను జెట్టీల్లో నిలపడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని మత్స్యకారులు కోరగా అందుకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ క్రమంలోనే విశాఖ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో బోట్లు వెలికితీత పనులు మొదలుపెట్టారు. విశాఖ పోర్టు అధికారులు, పోలీసులు, మెరైన్ సిబ్బంది, అగ్నిమాపకశాఖ అధికారులు, మెకనైజ్డెడ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ పనుల్లో భాగస్వాములయ్యారు.